నేను గమనించినవేంటంటే…

బ్లాగరు మహాశయులారా అందరికీ నమస్కారం!

చాలా రోజులయింది బ్లాగుల్లోకి అడుగు పెట్టి… అన్ని పనులూ ముగించుకుని ఇలా రాయడం మొదలు పెట్టడానికి – సుమారు రెండు నెలలు అయిందనుకుంటా! అయితే కూడలి మాత్రం రోజూ చదువుతూనే ఉన్నా!

 వాదాలూ, వివాదాలూ, వింతలూ, వినోదాలూ అబ్బో చాలానే ఉన్నాయిగా!

ఇన్నాళ్ళూ కేవలం పాఠకునిగా మిగిలాక, చాలా విషయాల్ని  గురించి ఒక మంచి అవగాహన వచ్చింది. అదే మన బ్లాగులూ, బ్లాగర్ల గురించేనండీ! అవేంటో మీతోనే చెప్పేస్తే బాగుంటుందనీ ఇలా మొదలెట్టా!

మన బ్లాగుల్లో ముఖ్యంగా నేను గమనించినవేంటంటే…

(నేను చెప్పబోయేవన్నీ ఖచ్చితమైనవి అనుకోకండి. అన్నింటికీ “అనిపిస్తోంది” అన్నది కలుపుకొని చదవండి.)

కొందరు బ్లాగర్లు ఇంతకు పూర్వం తమ పోస్టులపై వ్యాఖ్యానించిన వారిని దృష్టిలో పెట్టుకుని అవకాశం దొరికినప్పుడు వారి ఆలోచనలను అనాలోచితంగా ఖండిచటం పనిగా పెట్టుకున్నారు. (ఆధారాల విషయం ఎందుకులెండి!  మనందరికీ తెలుసు)

బ్లాగర్లలో వర్గాలూ ఉన్నాయండీ!!!

ఇంట్లో తమ వాళ్ళతో ఆప్యాయంగా గడపాల్సిన సమయాన్ని కాస్తా ఈ బ్లాగులకే వెచ్చిస్తూ అనవసరపు చెత్తంతా రాసే వాళ్ళు ఎక్కువయ్యారు.

అంతా రాసే వాళ్ళే గానీ, ఇతరుల పోస్టులను చదివి వాటిల్లోని వాస్తవాంశాలను గూర్చి ఆలోచించే వారి సంఖ్య తక్కువ!

కూడలిలో కనిపించిన వాళ్ళే కనిపిస్తారు, అంతే కాదండోయ్ వాళ్ళకు వాళ్ళే పొగిడేసుకుంటూంటారు. విషయం లేకపోయినప్పటికీ!

పాఠకులను ఆకర్షించాలనో, మరేదో చేయాలనో పూర్తిగా వ్యక్తిగత విషయాలను రాస్తూ, అందులో అనవసరపు చమత్కారాలు గుప్పిస్తూ, ఏదో ఉత్కంఠ రేపుతున్నామని భ్రమపడిపోయి, తమ ప్రతిభకు తామే మురిసిపోయే కొందరు ఉన్నారనీ… (వీళ్ళు రాసేవి యాత్రా చరిత్రలు, స్వీయానుభవాలు, అనుభూతులు కావు! వ్యాపార నవలల కన్నా ఇంకా ఇంకా హీనమైన ధోరణిలో…)
మంచి పాలు కూడా ఉందండీ!

వీళ్ళు తమ అభిప్రాయాల్ని సాలోచనంగా, నిర్భయంగా బయట పెడతారు. తమపై వచ్చే విమర్శల్ని గురించి కూడా ఆలోచిస్తున్నారు.

సమాజంలోని కట్టుబాట్లు, సిద్ధాంతాలు, ఆచారాలు మొ.న వాటికి పూర్తిగా లోబడిలేరు. వాటిలోని మంచి చెడ్డల్ని సవిమర్శకంగా అలోచిస్తూ పాఠకుల్నీ ఆలోచింపజేస్తున్నారు.(మాతృత్వం, ప్రాంతీయత, పాలన పరమైన అంశాలపై జరిగిన చర్చలను బట్టి.)

చదివించే విధంగా, ఒకవేళ చదివినా మంచి విషయాన్ని తెలుసుకున్నాం అని అనిపించే విధంగా రాసేవాళ్ళూ ఉన్నారు. అయితే వీరి సంఖ్య చాలా చాలా పెరగాలి.

ఇంకా చాలానే ఉన్నాయి గానీ ఇప్పటికివి చాలు.

వీటన్నిటికీ నేను పూర్తిగా అతీతున్ని అని మాత్రం అనుకోకండే!
 

తెలుగు సాహిత్య వేదిక

సమకాలీన సాహిత్యాన్ని ఇంటర్నెట్ పాఠకులకు అందుబాటులోకి తేవాలన్న మా ప్రయత్నం ఈనాటికి ఫలించింది. ఈ సాహిత్య వేదిక సాహితీ వేత్తల, సాహిత్య విద్యార్థుల , సాహితీ ప్రియుల అభిప్రాయాలు, వారి భావాల ప్రకటనకు ఒక వాహికగా కొనసాగుతుంది. ‘తెలుగు సాహిత్య వేదిక’ త్వరలోనే మరిన్ని శీర్షికలతో మరింత సాహిత్యాన్ని మీకు అందజేయనుంది. (మొత్తం చదవండి)

తెలుగు సాహిత్య వేదిక

ఇంటర్నెట్ పాఠకులకు ఉత్తమ సాహిత్యం అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశ్యంతో తెలుగు సాహిత్య వేదిక ముస్తాబవుతున్నది. తెలుగు సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్నవారు వేదికను తీర్చిదిద్దడంలో శ్రద్ధ వహిస్తున్నారు.

ప్రస్తుతం -సాహితీ పత్రిక ( బ్లాగు) హైదరాబాదు విశ్వవిద్యాలయం కేంద్రంగా వెలువడుతున్నది. అయినా కేవలం ఇక్కడి విద్యార్థులు, పాఠకులకే అని కాకుండా సమస్త పాఠక లోకానిక… (మొత్తం చదవండి)

మనసులో మాట!

తెలుగులో యిన్ని సైట్లా!!!

ఈరోజే  చూసాను తేనెగూడు…చాలా బావుంది…
యిక పొద్దును చూడందే పొద్దు గడవట్లేదు. కూడలిలో నడవందే మనసాగట్లేదు…

యిన్నాళ్ళూ   పుస్తకాల్లో తెలుగును వెతికిన ఈ కళ్ళు  యిప్పుడిలా కంప్యూటరునే కావలించుకుంటున్నాయి. బ్లాగులను విడిచి క్లాసులకా?
యమా బోర్…ఏముందక్కడ?

యిక్కడ నాలా ఏదో సంతృప్తి కోసం రాసేవారే కాదు…కొన్ని ప్రయోజనాలనాశించి మాత్రమే రాసేవారూ ఉన్నారు.వారి వ్యాసాల్ని చదువుతున్నప్పుడల్లా నిజంగా ఎంత ఆసక్తి…

నాక్కూడా  మీలా టపాలమీద టపాలు,టపాలమీద టపాలూ రాసేయాలనుంటుంది కానీ….విషయమూ,కాలమూ రెండూ వెక్కిరించేవే!

పోనీలెండి సమయముందిగా యింకా!  వీడింకా బడిపిల్లగాడే!

యిక నా సోదలా ఉంచితే…

తెలుగును యిలా నెట్ ప్రపంచంలొ వెలిగేలా చేసిన,చేస్తున్న మేధావులందరికీ అభివందనం!

ఇదో కొత్త వాదన!

రాయలసీమను కలుపుకుంటే ప్రత్యేక తెలంగాణాకు మద్దతిస్తారట!!! రాయలసీమ నాయకులు పత్రికల్లో హామీలిచ్చేస్తున్నారు. ఎంత మంచి ఆఫర్!

యిప్పుడేం చేద్దాం?  కలిపేసుకుందామా???

తెలిస్తే చెప్పండి!

ఆధునిక కాలంలొ (ఆధునికానంతర యుగంలో) సాహిత్యం వల్ల  ప్రయోజనమేంటి?

సాహిత్యాన్ని అభ్యసించకపోవటం వల్ల వచ్చే నష్టమేంటి?

నవ్వనా…ఏడ్వనా…?

ఎన్నిసార్లు అడిగా నా మాటని నీతో మాట్లాడకూడదని! ఎంతలా తిట్టా నా కళ్ళని నీ వైపు చూడకూడదని! ఎంత బలవంతపెట్టా నా నడకని నీవున్న చోటుకి నడవకూడదని! ఎంత అణిచిపెట్టా నా మనసుని నీమాటల మత్తుల్లో ,నీ చూపుల జల్లుల్లో ,నీ నడకలనాట్యంలో ఆనందాలు వెతుక్కోకుమని!

అయినా సరే; నా మౌనం మాట మారుస్తోంది. నా చూపు వెలుతురే నువ్వంటొంది. నా అడుగులు యిక గమ్యమేముంది అంటున్నాయి. పాపం అవి మాత్రం ఏం చేస్తాయ్;

పున్నమి నాటి వెన్నెలలా నా గుండెనిండా నిండిన నువ్వు,మల్లె పూల పరిమళంలా నా తనువంతా తడిపిన నువ్వు, ఆ జాబిలే తెల్లవారుతుంటె మసక మసకగా మారినట్లు, ఆ మల్లెలే సాయం సమయాన
అందమంతా వాడినట్లు అదోలా మారిపొయి, కళ్ళలోని ప్రేమను కన్నీళ్ళలో ఒంపేస్తూ, యిక మరు క్షణం ఉండదేమోనని ఆక్షణమే నన్నలుముకుంటూ, మాటలు మరిచిన మౌనంలా నిలువెల్లా వణికిపోతూ  నే..నంటే…యిష్టం లేదా? అనడిగితే,  నీ కన్నీళ్ళతో నా గుండెనంతా తడిపితే యిక ఏం చేయను…
గొంతులో మంటగా ఉందంటావ్. ఎందుకురా అనడిగితే నేనాపుకున్న బాధంతా అక్కడే ఉందంటావ్.

ఆ క్షణం; నీ కన్నీళ్ళలో, నువ్వు చెప్పిన గుండె మంటల్లో కరిగిన నా మనసును దోసిట్లొ పట్టి నీ పాదాల ముందు పరవాలనిపిస్తుంది.! పగలూరాత్రీ మరిచిపోయి, నీ నవ్వుల్లో నిద్రపోయి నీతోనే గడపాలనిపిస్తుంది.

జాబిలీవెన్నెల, పువ్వూపరిమళం, నీరూఆవిరి…ప్రేమికులైతే నువ్వు నేనూ అలానే అనిపిస్తుంది.

యింత చేసిన నువ్వు నన్నంతలా మార్చేసిన నువ్వే మళ్ళీమరోలా అంటావ్! నన్ను విడిచి వెళ్ళమంటావ్. నాకు దూరం కాలేవెందుకంటావ్. నువ్వు నింగి,నేను నేలా అంటావ్. మనమిద్దరం రైలు పట్టాలంటావ్.

యిక నవ్వనా…ఏడ్వనా…? ఎలా నవ్వను,ఎలా ఏడ్వను నాకూ నీలాగే గుండెలోని బాధంతా గొంతుకడ్డంపడితే…!

నా డైరీ మొదటి పేజీ

kesh.jpg

ఈ రోజంతా ఆనందమే!..

అందాల జాబిలికి
అందరూ చూస్తున్నారని సిగ్గేసి,
మబ్బు పరదాల మాటుకెల్లి
ముసిముసిగా నవ్వినట్టు..

ముదురు నీలిరంగు చీరకట్టి,
ముద్ద బంతిలా నువ్వు నవ్వుతుంటే,
అమ్మో చెలీ!
నీదెంత అందమే!!

యిక ఈ మాట అనక తప్పదు మరి,
చీరకు నువ్వందమా!
నీకు చీరందమా!

ఎవరికెవరందమైనా
నిను చుసిన కనులకు మాత్రం
ఈ రోజంతా ఆనందమే!..

ఇప్పుడు తెలిసింది

నాకో అనుమానం.
నీ పెదాలు పలికిన ప్రతీ మాట
సన్నగా మొదలయి
నను తీయగా తాకుతున్నాయి.
ఏంటా అని గట్టిగా ఆలోచిస్తే
ఆ దేవుడు
నీ గొంతులో వీణను దాచి
పెదాలపై అమృతముంచాడని అనిపిస్తోంది
అంతే కదూ!
దొంగా దొరికిపోయావ్….

Follow

Get every new post delivered to your Inbox.